69. అల్ హాఖ్కహ్
ఆయతులు
: 52 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 8 అనివార్యమైన సంఘటన! ఏమిటి ఆ అనివార్యమైన సంఘటన? ఆ అనివార్యమైన సంఘటన ఏమిటో నీకేమి తెలుసు?
సమూద్, ఆద్ జాతుల వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ విపత్తును నమ్మటానికి నిరాకరించారు. అందువల్ల సమూద్ జాతివారు భయంకరమైన ఒక ఉపద్రవం ద్వారా నాశనం చేయబడ్డారు. ఆద్ జాతివారు ఒక పెద్ద గాలివాన ద్వారా నాశనం చేయ బడ్డారు. అల్లాహ్
వరుసగా ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు వారిని దానికి గురిచేశాడు. (నీవు అక్కడ ఉండివుంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు చెట్ల బోదెలు మాదిరిగా చెల్లాచెదరుగా పడి ఉండటాన్ని నీవు చూస్తావు. ఇప్పుడు వారిలో మిగిలి ఉన్న వాడెవడైనా నీకు కనిపిస్తున్నాడా?
9 - 10 ఇలాంటి మహాపరాధానికే ఫిరౌన్, అతనికి పూర్వం గతించిన ప్రజలు, తలక్రిందులైన పురముల లోనివారు కూడ పాల్పడ్డారు. వారందరూ తమ ప్రభువు పంపిన ప్రవక్త చేసిన హితబోధను అంగీకరించలేదు. అప్పుడు ఆయన వారిని అతి కఠినంగా పట్టుకున్నాడు.
11 - 12 గాలివాన ఉధృతమయినప్పుడు, మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. ఈ విధంగా మేము ఈ సంఘటనను మీకు గుణపాఠం నేర్పే జ్ఞాపికగా ఉండేలా చేశాము. జ్ఞాపకం ఉంచుకునే చెవులు దానిని చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేలా కూడ చేశాము.
13 - 18 తరువాత ఒకసారి శంఖం ఊదబడుతుంది. భూమినీ, పర్వతాలనూ లేపి ఒకే ఒక దెబ్బతో
తుత్తునియలుగా చేయటం జరుగుతుంది. ఆ రోజున జరగవలసిన సంఘటన జరుగుతుంది. ఆ రోజున ఆకాశం బ్రద్దలవుతుంది, దాని వ్యవస్థ సడలిపోతుంది. దైవదూతలు దాని చుట్టుప్రక్కల చేరి ఉంటారు. ఎనిమిది మంది దైవదూతలు ఆ రోజున నీ ప్రభువు సింహాసనాన్ని తమపై ఎత్తుకుని మోస్తూ ఉంటారు. అదే మీరు హాజరుపరచబడే రోజు. ఆ రోజున మీ రహస్యాలేవీ దాగి ఉండవు.
19 - 24 అప్పుడు తన కర్మలపత్రం తన కుడి చేతికివ్వబడిన వ్యక్తి, ‘‘చూడండి, నా కర్మల పత్రాన్ని తీసుకుని చదవండి. నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి’’ అని అంటాడు.
కనుక అతను తనకిష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతాడు, అత్యున్నత స్వర్గవనాలలో ఉంటాడు, వాటి పండ్ల గుత్తులు వ్రేలాడుతూ ఉంటాయి. అలాంటి వారితో ఇలా అనబడుతుంది, ‘‘హాయిగా తినండి, త్రాగండి,
గత దినాలలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా.’’
25 - 37
తన కర్మల పత్రం తన ఎడమ చేతికి ఇవ్వబడిన వ్యక్తి ఇలా వాపోతాడు, ‘‘అయ్యో! నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వకుండా ఉంటే, నా లెక్క ఏమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో! నాకు (ప్రపంచంలో వచ్చిన) ఆ మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది! ఈనాడు నా ఆస్తి నాకు ఏమాత్రం పనికి రాలేదే. నా అధికారమంతా అంతరించిపోయిందే.’’ (అప్పుడు ఇలా ఆజ్ఞాపించ బడుతుంది) అతనిని పట్టుకోండి, అతని మెడకు కంఠపాశం తగిలించండి. ఆపై అతనిని నరకంలోకి విసిరివేయండి. తరువాత అతనిని డెబ్భై గజాల పొడుగు గొలుసుతో బంధించండి. మహనీయుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ ను ఇతను విశ్వసించేవాడు కాదు, నిరుపేదలకు అన్నం పెట్టండి అని ప్రోత్సహించేవాడూ కాదు. కనుక ఈనాడు ఇక్కడ ఇతని ద్ణుఖంలో పాలుపంచుకునే స్నేహితుడెవడూ ఉండడు
గాయాల కడుగు తప్ప అతనికి తినటానికి ఆహారం కూడ ఏదీ ఉండదు. దానిని పాపాత్ములు తప్ప మరెవరూ తినరు.
38 - 52 కాదు, అది కాదు. మీరు చూస్తూ ఉన్న వస్తువుల మీద, మీరు చూడలేని వస్తువుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను
ఇది గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు, ఏ కవికి చెందిన వాక్కూ కాదు. కాని మీరు విశ్వసించటం అనేది చాల తక్కువ. ఇంకా ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు. కాని, మీరు ఆలోచించటం అనేది చాల తక్కువ. ఇదసలు సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది. ఒకవేళ ఇతను (దైవప్రవక్త) స్వయంగా కల్పించి ఏదైనా విషయాన్ని
మాకు ఆపాదించి ఉంటే, మేము ఇతని కుడి చెయ్యిని పట్టుకునేవారము, ఇతని మెడ నరాన్ని కోసివేసేవారము. అప్పుడు మీలో ఎవ్వరూ (మమ్మల్ని) ఈ పని చేయకుండా ఆపగలిగే వారు కారు. అసలు ఇది దైవభీతి కలవారికి ఒక హితోపదేశం. మీలో కొందరు తిరస్కరించే వారున్నారని మాకు తెలుసు.ఇటువంటి తిరస్కారులకు నిస్సందేహంగా ఇది ద్ణుఖ కారణం అవుతుంది. ఇది పూర్తిగా నమ్మదగిన సత్యం. కనుక ఓ ప్రవక్తా! మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
No comments:
Post a Comment